Friday, May 23, 2008

" Kalaprapurna" Panditha KOTHA SATYANARAYANA CHOWDARY

Kalaprapurna Panditha
KOTHA SATYANARAYANA CHOWDARY (1907 - 1974)
ఉభయ భాషా ప్రవీణ,పండిత-కొత్త సత్యనారాయణ చౌదరి (1907 - 1974) ప్రముఖ సాహితీ విమర్శకులు, పండిత కవి, మానవతావాది మరియు ఆదర్శ అధ్యాపకులు
జీవిత చరిత్ర :
కొత్త సత్యనారాయణ చౌదరి గుంటూరు జిల్లా తెనాలి తాలూకా అమృతలూరు గ్రామంలో బుచ్చయ్య చౌదరి మరియు రాజరత్నమ్మ దంపతులకు డిసెంబరు 31, 1907 సంవత్సరంలో జన్మించారు. ఇతడు ప్రాధమిక విద్య అమృతలూరు సంస్కృత పాఠశాలలో గావించారు. అక్కడ భాషా ప్రవీణ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై, చిట్టిగూడూరులోని నరసింహ సంస్కృత కళాశాలలో చేరి 1929లో ఉభయ భాషా ప్రవీణ పట్టా ప్రథమ శ్రేణిలో పొందినారు. శ్రిమత్తిరుమల గుదిమెళ్ళ వరదాచారి, దువ్వూరి వెంకటరమణ శాస్త్రి వీరి గురువులు. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి సాంగత్యంలో వీరి లోని సంఘ సంస్కరణ భావాలు బలపడ్డాయి. ఈయన నిడుబ్రోలు ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా, అనంతరం పాములపాటి బుచ్చినాయుడు కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా ఉద్యోగం చేస్తూ రచనా వ్యాసంగం కొనసాగించారు. 1930 లోనే భాషా పోషక గ్రంథ మండలి స్థాపించి దాని ద్వారా తన రచనలను ప్రకటించడం ప్రారంబించారు.

వీరి విమర్శక రచనలు జనసామాన్యంలోనే కాక, సాహితీలోకంలో సంచలనం సృష్టించాయి. తొలుత తెలుగు విద్యార్ధి మాసపత్రిక లోను, తదుపరి 1961 జూన్ నుంచి భారతి మాసపత్రికలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయకల్ప వృక్షం పై విమర్శల పరంపర కొనసాగించారు. తదనంతరం కల్పవృక్ష ఖండనం గా ప్రచురించారు


ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ఇతడిని 1974లో కళా ప్రపూర్ణ పురస్కారంతో సన్మానించింది. పొన్నూరు, నిడుబ్రోలు పట్టణ ప్రజలు గజారోహణ సత్కారం చేశారు. వీరికి ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆదర్శ ఉపాధ్యాయులు, ఉత్తమ పండితులు, ఉదాత్త విమర్శకులు అయిన ఈయన డిసెంబరు 15, 1974 సంవత్సరంలో పరమపదించారు.( 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005. నుండి)
.............................

తెలుగులెంకగా ప్రశస్తులైన తుమ్మల సీతారామమూర్తి గారు అందించిన ప్రశంశ ' హితవాణి' :
తుమ్మల సీతారామ మూర్తి గారు - సత్యనారాయన చౌదరి గారు

కొత్త సత్యనారాయణ కోవిదుండు
గురుఁడు, కవి, విమర్శకుఁడుగా గరిమనందె
నిన్నినేరుపు లొక్కచో నిరపుకొంట
యబ్బురం బని భావించు నంధ్రజగము

అస్తికతయందు నితఁడు ప్ర
శస్తిం గనె వేంకటేశచరణార్చకతన్,
స్రస్తాఖిలవేదనుఁడై
స్వస్తిం గను నితఁడు నేఁడు జలజాక్షు కడన్


పున్నెములకున్ గొటారగు
నన్నయ తిక్కన్న యెఱ్ఱనయు సోమనయున్
జిన్నయసూరి యుఁగన్పడ
మిన్నందిన తనివి నితఁడు మెలఁగుచునుండున్

నా కథాసరిత్సాగరవాకు నీదు
గద్యమునఁదోఁచు నని యనవద్యుఁడైన
వేదము బుధుండు కొనియాడ వినతుఁడగుచు
బాష్పములు రాల్చి యుండు నీపండితుండు

మానవత్వ దృష్టిలేని పురాణముల్
త్రచ్చి నిజము వెలికిఁదెచ్చి తనుచుఁ
ద్రిపురనేని సుకవి దీవింప నిది నీదు
కరుణ యని యతండు కరఁగియుండు
(తెలుగు పలుకు - 2007 , 16వ తానా సమావేశాల జ్ణాపక సంచిక నుండి)














సత్యనారాయణ చౌదరి దంపతులు
కళాప్రపూర్ణులు
రచన: కొమ్మనేని వెంకట రామయ్య

ఉభయ భాషా పండితులుగా, ఉపాధ్యాయులుగా, విమర్శకులుగా, సాహితీవేత్తలుగా, సరస హృదయులుగా, కళాప్రపూర్ణులుగా, కవి పండిత లోకానికి కాదర్శప్రాయులుగా , భాషా పోషకులుగా ప్రశస్తిగాంచిన సత్యనారాయణ చౌదరి గారికి జోహారులు. వీరు బాల్యమాది విద్యావ్యాసంగమున సంపాదించిన సాహిత్యం సజ్జన సమ్మాన్యము సూరి జనస్తుత్యమునైనది. వీరు వైదిక వాఙ్మయమును తొలుత రచించి ధర్మశాస్త్రాల మర్మమెలయించిరి . వివిధ నీతి కధాసారాల వెలార్చి విమర్శకాగ్రేసరులగుటయే గాక తమ దైవభక్తిని, గురుభక్తిని,దేశభక్తిని ప్రకటించుకొని మహాకవీంద్రులైరి. సత్యనారాయణ గారి వచన రచనా విధానము అనుసర ణీయము, ఆదర్శప్రాయమునైనది. అలతి యలంతి వాక్యాలతో కధాగమనము సాగించుటలో వీరి భాషాపటిమ యాంధ్రినలంకరింపచేసినది. సరళము , సరసము , శయ్యా సౌలభ్యముగల వచన రచన సాగించి కవులలో ప్రధమ శ్రేణికి చెందినవారు. గద్యంకవీనాం నికషం వదన్తి అనునాశయమును ప్రధానాంశముగ నేర్పరచుకొనియే ముమ్మొదట గద్య రచనమునే సాగించిరి. అనువాదాలతో అర్ధౌచితిని భావ గాంభీర్యమును పొందుపరచుకొని యందముగా వీరి రచన కొనసాగినది. పఠనాసక్తి విమర్శనాశక్తి విస్తరిల్లిన యనంత్రము పద్యరచన ప్రారంభించిరి. వీరు పురాణాంశాలలోని వింతలను, విశేషాలను వివరించి తమ భావాల వెల్లడించుటలో నొకింతేని సంశయం పడని విద్వన్నణులై, ఆయాకాలమందలి ధర్మాలలోని మర్మాల పరిశీలించిన పండిత ప్రకాండులై, పద్య కవితారీతుల నాంధ్రలోకానికందించిన కవివరేణ్యులై, కళాప్రపూర్ణులై, సత్కీర్తి నార్జించుకొనిరి. నిరంకుశాఃకవయః అను సూక్తి లోని సూనృతమును గ్రహించి భారత రామాయణాదు లంగల కధాంశాల గైకొని విషయ పరిశీలన మొనర్చి విజ్ణలోకానికే కనువిప్పు కలిగించిరి. విమర్శనము సైతము వితండ వాదమునకు పోక సశాస్త్రీయముగ సహేతుకముగా జరిపించిరి .

ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి"కళాప్రపూర్ణ " స్వీకరిస్తున్న చౌదరి గారు

ఇక వీరి రచనా విశేషాల కొలదిగ మాత్రమే పరిశీలించుదుము. కలిపురాణములో దుర్యోధనుని దొరతనమును వర్ణించుచు "ఈ కతలన్నీ వాస్తములేయని యెంచగ వచ్చు ద్రొల్లియాయాకవులెందరో తమ మహాకృతులందు వచించువానినే వ్రాసి చూపితిని గాని మదీయ కవిత్వ కల్పనా పాకము గాదు" అని తమ కవితారీతులకు గల కారణాల వెల్లడించి కల్పనలలో యదార్ఠము లోపించినదని వక్కాణించిరి. మరియు "కవియగువాడు దాస్యమును కర్మము కాలి కవిత్వధోరణిన్ భువి వెలయింప జ్రొచ్చిన పూర్వ విశేషముతోడి పక్షపాత విధము లెస్సగా బొరయు, దానిని భారతగాధ సాక్ష్యమే యవును" , అని కవిపక్షపాతము వహించిన కలుగు దోషమును నిరూఊపించిరి . మరొకచోట "ఆవేశము లేక ధర్మము వివేచన సేసిన నిగ్గు తేలెదిన్," అని లోకమునే నిగ్గు తేల్చవలసినదిగా నుగ్గడించిరి . ఇట్లే వేరొక వర్ణనమున , "ఎదోగికురించి పూతలు సమున్నత ధోరణి బూయుచుండు, నాయా కధలిట్టి వానికనయంబును బ్రాత్రములై వెలింగెడిన్,"అని తమ సునుశిత సువిశాల ధోరణిని సువ్యక్తమొనర్చిరి. ఒకచో భీక్ష్ముని కధను వర్ణించుచు , "కుమారిలభట్టు దొట్టివిఖ్యాతుల శాస్త్రవేత్తలు ప్రకాశము సేసి సకారణంగా నీతని నీతినెన్నరిది యీప్రజబుధ్ధినెఋంగ దేలొకో," అని పెద్దలు శాస్త్రవేత్తలగు వారి నుదాహరించి గాధల లోని గకావికలకు చీకాకు చెందిరి.ఇంకొకచో క్షేత్ర బీజాల విభిన్న మార్గపు పోకడల దలంచి , "పురాణ గాధలన్ యోజన చేసి చూడవలె నోరిమి దీక్షయు బూని నెవ్వడేన్ ," అని యనూచానముగా వ్యాప్తమగు గాధల యెడ నుండవలసిన దీక్షను సూక్ష్మబుధ్ధిని విశద పరచిరి . ఒకచో వ్యాస సుతుల లోని విభేదమును చర్చించుచు , "ఇట్లే సరిపెట్టుకొంచు కధ లెన్నియో గాసట బీసటయ్యెడిన్," అని ఏ చోటున కాచోట సమన్వ యించుకొని కాలమును కాపురుషులను సరిదిద్దుకొని పోవువారిని గూర్చిన సమాచారాల సన్నిహిత పరచిరి. వ్యాసుని ఘట్టాలను వర్ణించుచు , " ఈ విధమున వ్యాసమౌని యవివేకము సూపి యధర్మ కార్యమయ్యదనువ జేసె,వీడొక మహాత్ముడె వేద విభాగకర్తయే, " అని దిటవుగా చెప్పగలట్టి కవులెందరుందురో విజ్ణులూహించు కొందురు గాక?
భారత ప్రశస్తి నొనర్చుచు , జయ శబ్ద నిర్వచన మొనర్చి అనల్ప కల్పనలు భారతాన చేరినవనియు యదార్ధ దృష్టి ప్రాకృత లోకాని కవసర మనియు ప్రబోధించిరి. వీరాస్తిక్య పరిజ్ఞానము కలవారేగాని మూఢముగ విశ్వసించువారు కాదు. తమ భక్తిప్రపత్తుల నభివ్యక్త మొనర్చు కొనుచు , మ్రొక్కుబడి, మాస్వామి, వంటి గ్రంధ రాజాలను రచించిరి. సత్య నిరతిలో నిశ్చలాంతరంగాన నిరంతరం పరమాత్ముని ధ్యానింఛూటయే వీరి ప్రధానాశయం. అట్టి తలంపులున్నందున సూక్తులనుద్ధరించి సుకృతులుగా గణ్యత గాంచిరి .రామాయణ రహస్యాలలో , "ప్రత్యంశము సమగ్రంగా పరిశీలించి మంచి సెబ్బరలు నిర్ణయించి మేలు గ్రహింపవలె," నని చాటిచెప్పిరేగాని ,స్తోత్రపాఠకుల వెంట వేసుకొని కల్పనా గరిమకు లొంగిపోలేదు. ఆర్ష కవులపై ధ్వజమెత్తి, గ్రంధాలగల పాఠాంతరాలకు, వ్యాఖ్యాతల నిర్ణయాలకు , ప్రచారకుల ప్రాబల్యానికి , గల విభేదములను చూపించి విజ్ఞులనిపించుకొన గలిగిరి. వంతలుపాడు వారిని భజగోవింద రాయిళ్ళను చెంత చేరనీయక ఆత్మశక్తి వలన నందరిని ఆకర్షించి యభిప్రాయాలను గ్రంధాల రూపాన రూపొందించిరి.ఇంకను కవిరాజు కళాఖండాలలోని సాహిత్యమును , సాంఘిక దృష్టిని విశద పరచిరి . వీరి విమర్శనమునకు నిస్వార్ధమునకిది నిదర్శనమే కాగలదు . భారత రామాయణాలు పవిత్ర భారతావనిలో పరమార్ధ సాధనాలుగా భావించి నిత్య పఠనం మాత్రమే చేయుచుండు వారికి వీరి గ్రంధాలు గొడ్డలిపెట్టు వంటివి కావచ్చు. కాని సువిశాల దృక్పధంతో చారిత్రక విషయాలను సమీక్షించు వారికి , సారస్వత పరిశోధన మొనర్చు వారికి ప్రోత్సాహకములు , ప్రకృష్ట ప్రభోదకములు కాగలవు. భావ విప్లవాలతో వర్ధిల్లు లోకము యదార్ధానికై కృషి సల్పి భవ్య భారతమును నవ్యమొనర్చుకొందురు గాక?(తెలుగు పలుకు - 2007 ,16వ తానా సమావేశాల జ్ణాపక సంచిక నుండి)

పండిత శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి

రచన : ఆచార్య యార్లగడ్డ బాల గంగాధర రావు

తెలుగు చదువుల మాగాణం లో ఎందరో మహానుభావులు . ఆధునికాంధ్ర సరస్వతిని తమ అమూల్య రచనలతో కైనేసిన విద్వద్విమర్శక మండలిలో ముఖ్యులు పండిత శ్రీ కొత్త సత్యనారాయణ దేశికులు. సాహితి సమారాధకులుగా సాహితీరంగంలో వారు మెట్టని చోటు , పట్టని ప్రక్రియ లేదు . కవిగా ,పండితుడుగా,నాటక కర్తలుగా ,కధకులుగా , సరస విమర్శకులుగా, సాహిత్యాభిలాషులందరకూ చిరపరిచితులు .అన్నింటికంటె మిన్న దేశికులుగా వారెందరికో విద్యాదానం చేసిన మహానుభావులు .ఉపాధ్యాయ పండిత పండిత పరిషత్తుకు కార్యదర్శిగా, ఉపాద్యక్షులుగా స్వసంఘానికి వారు చేసిన సేవ ఎంతో అమూల్యమైనది. అటు జాతీయోద్యమానికి ఇటు సాహిత్యోద్యమానికి ఆటపట్టయిన గుంటూరు మండలం వీరిది. 1907 డిసెంబరు 31న వీరు తెనాలి తాలూక అమృతలూరులో,శ్రిమతి రాజరత్నమ్మ , బుచ్చయ్య చౌదరి గార్ల నోముల పంట గా జన్మించారు . ప్రాధమిక విద్యాభ్యాసానంతరం , స్వగ్రామం లోని సంస్కృత పాఠశాలలో కంభంపాటి స్వామినాధ శాస్త్రి పర్యవేక్షణలో చదివి ప్రవేశ పరీక్ష పూర్తి గావించారు . ఆపిమ్మట చిట్టిగూదూరు నారసింహ సంస్కృత కళాశాలలో నాలుగేండ్లు గురుకుల వాసం గావించి , 1929 లో ఉభయ భాషాప్రవీణ పూర్తి చేసి అటు జన్మ వంశానికి, ఇటు విద్యావంశానికి వన్నెచిన్నెలు చేకూర్చి ఉభయ వంశ దీపకులుగా ప్రశస్తి గాంచారు.పండిత పట్టం పొందినది మొదలు, పి.బి.ఎన్. కళాశాలలో తెలుగు పండితులుగా పదవీ విరమణ చేసే వరకూ , దాదాపు నాలుగు దశాబ్దాలు అధ్యాపక వృత్తి నెరపి, ఎందరందరో శిష్యులకు తమ విద్యావిజ్ఞానాలను పంచిపెట్టిన మహామనీషి శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి. ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో తెలుగునేల నాలుగు చెరగులా పునర్వికాసనోద్యమానికి దోహదకారిగా జాతీయవాదం వెల్లివిరిసింది .అదేసమయంలో సూత్రాశ్రమ స్థాపకులు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారి హేతువాదతత్వం వేళ్ళూనుకొంటున్నది. ఇందులో రెండవ దానికి కార్యరంగం తెనాలి సీమయే కావడంతో , నాటి భావకులెందరిపైననో పై రెండింటి ప్రభావం విశేషంగా ప్రసరించింది , ప్రభావితంచేసింది. అట్టి ప్రభావితుల కోవలోని కోవిద్రగ్రామణులలో అగ్రేసరులు శ్రి కొత్త సత్యనారాయన చౌదరి గారు హేతువాద తత్వ ప్రభావంతో నిరంతర సత్యాన్వేషి అయ్యారు. ఈఅన్వేషణ ,అనంతర కాలంలో వీరు సంతరించిన రచనలలో స్పష్టంగా కానవస్తుంది . కలిపురాణం , రామాయణ రహస్యాలు , కల్పవృక్ష ఖండనం మొదలైన గ్రంధాలు వీరి సత్యాన్వేషణకు , తత్వాన్వేషణకు మారు రూపాలు. యుగాలు నాలుగనీ, ధర్మ దేవత మొదట నాలుగు పాదాలా నడచి , నడచి ఆయాసం వచ్చి , కలియుగం లో ఒక కాలిమీదనే గెంతుతూ నడుస్తోందనీ ప్రబుధ్ధులు కొందరు చెప్తారు . వీరు తమ కలిపురాణం లో , యుగాలు నాలుగింటిలోనూ ,ఎన్నో అంశాలలో కలియుగమే మేలని సహేతుకంగా సిద్ధాంతీకరించారు. అంతేగాక , ఇందులో వీరు ఆర్య ద్రావిడ వర్గ విభేదం , వర్ణాశ్రమ వ్యవస్థ , అస్పృశ్యత ,రామాయణ భారత కాలాలనాటి సాంఘికాచారాలు, పురాణ పురుషుల జన్మ రహస్యాలు మొదలైన వాటిని గూర్చి ఎన్నో వివరాలను చక్కటి సాక్ష్యాలతో సహా బహిర్గతం చేసారు. నిజంగా ఇది వీరి పరిశీలనా పటిమకు పటిష్టమయిన సాక్ష్యం . ఈకోవకి చెందినవే రామాయణ రహస్యాలు, కల్పవృక్ష ఖండనమనేవి కూడా.ఆంధ్ర దేశంలో రామాయణానికున్న ప్రశస్తి అంతా ఇంతా కాదు. రాముడు పురుషోత్తముడనీ , దేవుడనీ , సత్యవ్రతుడనీ, అతని మీద మనకున్న ఎన్నో అభిప్రాయాలు . అయితే అలాంటిదేమీ లేదని ,అతదు కూడా మన లాంటి మనిషేననే పచ్చి నిజాన్ని , వాల్మీకాన్ని బట్టే ఱుజువు చేశారు వీరు. ఇక కల్పవృక్షఖండనం , విశ్వనాధవారి రామాయణ కల్పవృక్షంపై విపులమైన సమీక్ష. ఇంకా వీరు వెలువరించిన వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగిన వాటిలో మరొకటి కామశాస్త్రం . ఇది వాత్స్యాయనుని కామసూత్రాలకు తెలుగు సేత. శాస్త్ర గ్రంధాల ఆవశ్యకాన్ని , రచనా విధానాన్ని నిర్ధారించే రచన. వీరి మొత్తం రచనలు డెబ్బదికి పైమాటే . ముందే చెప్పినట్లు వీటిలో పద్య కావ్యాలున్నాయి, గద్య కావ్యాలున్నాయి, విమర్శనలున్నాయి, వ్యాఖ్యానాలున్నాయి, నవలలు, నాటకాలు, కధలు , గాధలు. ఈ విధంగా అన్ని సాహితీ రంగాల లోను వీరికి ప్రవేశం ఉంది. అన్ని చోట్ల తమదైన ఒక బాణీ నెలకొల్పారు. వీరు రచించిన జీవిత చరిత్రల్లో కవిరాజు(త్రిపురనేని రామస్వామి జీవితం) , కులపతి( వరదాచార్యుల వారి జీవితం ) పేరెన్నిక గన్నవి. పంచదశి , శకున్తల అనేవి వీరి సంస్కృత రచనలు. వీరి విశిష్ఠ సేవలకు గుర్తింపుగా తెలుగునాట పలు తావుల సభలు , సన్మానాలు ఎన్నో జరిగాయి. ముఖ్యంగా చెప్పుకోదగ్గవి (వారు పని చేసిన నిడుబ్రోలు లో ) గజారోహణం, వీరి పట్ల విద్యార్ధులకు , సహోపాధ్యాయులకు పురజనులకున్న గౌరవాదరాభిమానాలకు ప్రత్యక్ష నిదర్శనం. అట్టి వీరికి ఆంధ్ర విశ్వ విద్యాలయం కళాప్రపూర్ణ బిరుదు నిచ్చి సత్కరించటం తెలుగు వారికి , ఆంధ్ర విశ్వ విద్యాలయానికి కూడా గర్వకారణం. (తెలుగు పలుకు - 16వ తానా సభల జ్ఞాపక సంచిక నుండి)
ధన్యజీవి
రచన: డాక్టర్ వడ్డెగుంట అంకయ్య

సమాజములో భిన్న విభిన్నమైన మనః ప్రవృత్తులు గల మానవులను మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. కొందరు గోముఖ వ్యాఘ్రములు , కొందరు వ్యాఘ్రముఖ గోవులు ,మరి కొందరు ఏమీతెలియని అమాయక బ్రహ్మలు. అంతా తమాషాగా ఉంటుంది. ఈసృష్టి అంతా ఇంతే... కొందరి మాటలు తియ్యగా ఉంటవి. కాని మనసు విషభరితం. కొందరి మాటలూ విషమే, మనసూ విషమే . వీరు సమాజమునకు చీడపురుగులు లాంటి వారు. అసూయ , ద్వేషం , స్వార్ధం , మోసం .. అన్నీ ముమ్మూర్తులా వీరిలో పొడగొట్టు చుండును . కొందరి మాటలు తియ్యవే , మనస్సు తియ్యనే ..ఈలాంటి వారు సమాజంలో ఏకొద్ది మందో ఉంటారు. నేటి నవ సమాజంలో ఈలాంటి అమాయకులు పైకి రావడం చాల అరుదు. సమాజంలో అందరిట్టి వారయితే మంచిదే. కాని నూటికొక్కడు కోటికొక్కడున్నందు వలన అటు వ్యక్తికి గాని , ఇటు సమాజానికి గాని కలిగేప్రయోజనము చాల తక్కువ.
మరి కొందరిలో మాటలు పరుషమే , కాని మనసు నవనీతము లాగ మెత్తగా నుండును. మనం జాగ్రత్తగా పరిశీలించినచో వీరి హృదయము నిష్కల్మషమై , ప్రేమపూరితమై ,దయార్ద్రమై యొప్పుచుండును. అయితే .. వీరిలో్నున్న గొప్ప లోపమేమంటే నిశ్చయంగా , నిస్సందేహంగా , మొగమాటం లేకుండా తప్పును తప్పుగా వ్రేలుపెట్టి చూపించడమే . అందువలన ఒక్కొప్పుడు ప్రజాదరణకు దూరులవుతూ ఉంటారు . ప్రజాదరణకు దూరమైన , ప్రభువుకు దూరమైన , ఎవ్వరేమనుకొనినను ఇటువంటి మనస్తత్వము గలవారు తమ పట్టును వీడరు . తాను చెప్పదలుచుకొనినదేదో సూటిగా చెప్తారు . వ్రాయదలచు కొనినదేదో నిరభ్యంతరముగా వ్రాస్తారు. విమర్శించ దలచుకొనినదేదో హేతుబద్ధంగా విమర్శిస్తారు. ఈ కోవకు చెందిన వారే కళాప్రపూర్ణ శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి గారు . వీరు వ్రాసిన కలిపురాణమే ఇందుకు నిద ర్శ నము. ఈ కలిపురాణము శ్రీ రామస్వామి చౌదరి గారి సూత పురాణము యొక్క అడుగు జాడల్లో నడచినదేమో ననిపించును . పురాణములెంతవరకు బ్రతికూలములో , ఎంతవరకు నీతి బాహ్యములో , ఎంతవరకు పక్షపాత భూయిష్టములో , ఎంతవరకు ధర్మవిరుద్ధములో ,మోడ్పు కనులతో నున్న విద్యాలోకమునకు జూపించు తలంపుతో , హేతువాద దృక్పధముతో సూతపురాణము రచింపబడగా , పురాణములలో నుటంకించిన ధర్మము నేటి సమాజమునకు పనికి రాదనియు , చాతుర్వ్ర్ణర్ణ వ్యవస్థ సర్వము వట్టి బూటకమనియు, అదిబొత్తిగా సహింపరాని క్షమింపరాని యొక పెద్ద మోసమనియు. దీనిని సమూలముగా పెళ్ళగించిన నాడే ఈదేశమునకు మోక్షము కలుగుననియు కలిపురాణము ఘోషించు చున్నది. హిందువులందొక కొందరెన్నడొ పదిలము చేసి శాస్త్రమని వ్రాసిన మాటలలో న్యాయమన్నది లవలేశము లేదంటారు సత్యనారాయణ గారు. మన మొగాన వ్రాసిన వ్రాతల లాగ , ఈ పురాణములు కుప్పలు తెప్పలుగా పుట్టి సాంఘిక ధర్మములను చెడగొట్టుచు, సమాజ పతనానికి దారి తీస్తున్నదని వీరి యావేదన, వీరి తార్కిక దృక్పధానికి మచ్చు తునక లాగా వెలిసింది ఈ కలిపురాణము. మన పురాణములలో " ఒకడు మృగంబు గర్భమున నుద్భవమొందెను . అహో? ఎంత విచిత్రమో చూడండి . జంబుకంబు జంటకు నొక మౌని పుట్టె ; ఎంత వింతో చూచినారా?ఒక టక్కరి కన్నెకు గల్గె - అహా ? ఎంత ఆశ్చర్యము. దేవదాసికి నొకడాత్మజుండయి విశిష్టుడు గాదనరారె - కుండలో నొకండు వెలింగె - ఎంత తమాషాగా కల్పించారో చూడండి. ఈ మునీశ్వరులు కుక్కలు నక్కలకు పుట్టినారనుట ఎంతవరకు నమ్మవచ్చును. వారు శాస్త్ర పురాణములు వ్రాసినారనుట ఎంతవరకు విశ్వసనీయమో , ఆలోచించమంటారు కవిగారు. పొట్ట కోసమై ఎవ్వరో వ్రాసి యుండవచ్చు నంటారు అవి యన్నియు బూటకములు ,కల్ల బొల్లి కధలతో కన్నుగప్పి ప్రజలను తప్పుత్రోవ పట్టించునంటారు చౌదరి గారు. "భాగవతం చెప్పినది భారతమొప్పదు , భారతంబులో భాగములైన వానికె వాదము తప్పదు , వాని జూడగా నోరును బాస తేల్చుకొను నోర్పును గల్గదు- పైగా -దానిచే సేగియు వచ్చుగాన పరిశీలన చేసి గ్రహింపగోరుదన్" ..అని పురాణములలోనె పరస్పర విరుద్ధములైన న్యాయ ధర్మములున్నట్లు - వాని ననుసరించినచో మంచి బదులు చెడ్డయే కలుగునని వివరించినారు. పురాణములలో వర్ణించిన స్త్రీ పురుషుల చేతలు , వారి మానసిక ప్రవృత్తులు సమాజమున కాదర్శనీయములుగా నుండలేదు సరి కదా.. మీదు మిక్కిలి సమాజమునకు మిక్కిలి రోత కలిగించుచున్నవి. అందుకు నుదాహరణముగా దేవేంద్రుడుఅహల్యతో సాగించిన సరసాలు , ద్రోణుడు ఏకలవ్యుని విషయములో చూపిన కుధర్మము , ఈలాంటి ధర్మవిరుద్ధములగు కధలెన్నింటినో భారతములో నుండి ఎత్తి చూపించారు. ప్రజా స్వామ్యములో వర్న వ్యవస్థ అనేది దేశప్రగతి కొక అంతులేని అంతరాయము. దీనిని సమూలముగా పెకళించాలి. అందుకై కొందరు మేల్కొని భావ చైతన్యులు కావాలి. విప్లవము తీసుకొని రావాలంటారు, చూడండి... " ఎవనికి వాడే మౌనముగ నేమియు జోక్యము లేక సాగినన్ , జెవిటికి శంఖమూదియు విశేషము కానని యట్లు వ్యర్ధ మై యవనివి కెట్టి సంస్కరణ మన్నను ముందున కందు బాటుగా కనియదు దాని మూలమున గాదె యని యన్నియు దాపురించుటల్..కావున తోచినట్టులది కాదిది కాదని త్రోసి రాజుగా బోవక యేదొ కొంచెము బుద్ధికి వచ్చిన యట్టి సాయ మొనరించినచో లోకమున కభ్యుదయమొనరించుట యగునని"..సహృదయములకు విన్నవించినారు. అంతే కాదు అనేక కుల,మత ,వర్గ , విభేదాలను సృష్టించి పాత్రను బట్టి భిన్న భిన్న ధర్మములను పదేశించే శాస్త్ర పురాణాల జోలికి పోక తాతలనాటి గ్రంధముల ధర్మములన్నిసమన్వయించి యేరోతయు లేని ధోరణిలో , విరోధమావంతయు లేని రీతిలో నీతులు సేకరించి యొక నియమముతో నెల్లవారినొక జాతిగా నేర్పరుప జారినచో లెస్సగ నుండునని సూచిస్తారు. వీరి నిశిత పరిశీలనా దృష్టికి ,హేతువాద దృక్పధమునకు , విమర్శనా పటిమకు , నిదర్శనముగా కలిపురాణము లోని పరశురాముడు, ప్రహ్లాదుడు, హరిశ్చంద్రుడు, దుర్వాసుడు,రామరాజ్యము,శీర్షికలు గీటురాళ్ళు. రామరాజ్యము లో " అన్నము కోసమై యహరహంబును గోసల దేశమందు రామన్నను వేడుకొంటూ యమయాతనలందుటజేసి కల్గెనా అన్నమొ రామచంద్ర,యను నట్టెది, యందరు తిండీయుండి సంపన్నులు నైన నిట్టిది యభాగ్యపు సామెత పుట్టబోవునా?’ అని పాఠకులకు సింహావలోకనము కలిగిస్తారు. కలిపురాణము ను గాంచి చౌదరి గారు నాస్తికులని తలంచు ప్రమాదము కూడా లేకపోలేదు.చౌదరి గారు గొప్ప ఆస్తికులు.వీరి అపారమైన భక్తిని వారి మాస్వామిలోని " మ్రొక్కుటే నాకు హక్కు, నాయక్కఱలను దీర్పవాయని నిన్ను బాధింపనయ్య ఏను నీవాడనైన నాకేమి తఱుగు? వేగరావయ్య తిరుమల వెంకటేశ..ఆస్తికత నాస్తికత వాదమంత నీదు శక్తియుక్తులు తెలియగా సమసిపోవు నీరహస్యమెరింగి వారి బ్రోవ వేగ రావయ్య తిరుమల వెంకటేశ.. అను పద్య పంక్తులే ప్రబల నిదర్శనములు. యుక్తాయుక్త పరిజ్ఞానముతో, ఔచిత్యానౌచిత్యా పరిపోషణతో , సాహితీసౌహిత్య స్రవంతుల ప్రవహింపజేసి , సారవంతమైన తెలుగు నేలపై దాదాపు డెబ్బది పసిడి పంటలను పండించి సాహిత్య శ్రీమంతుడని పించుకొనిన శ్రే సత్యనారాయణ చౌదరి గారు సర్వదా ధన్యులు.

కళాప్రపూర్ణ కొత్త సత్యనారాయణ చౌదరి
మధుర స్మృతులు
కళాప్రపూర్ణ కొత్త సత్యనారాయణ చౌదరి
జననము: శ్రీప్లవంగ-మార్గశీర్ష-బహుళ-విశాఖ
1907-12-31 మంగళ వారము
తల్లి దండ్రులు : శ్రీ రాజరత్నమ్మ- బుచ్చయ్య
గురుపాదులు: బ్రహ్మశ్రీ కంబంపాటి స్వామినాధ శాస్త్రుల వారు,మీమాంసా శిరోమణి
శ్రీ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ వరదాచార్యుల వారు,ఎం.ఏ(ఆనర్స్) కళాప్రపూర్ణ,కులపతి,మహొపాధ్యాయ
బ్రహ్మశ్రీ దువ్వూరి వెంకట రమణ శాస్త్రుల వారు,విద్వాన్,కళాప్రపూర్ణ
శ్రీమాన్ కరి రామానుజాచార్యులు, వ్యాకరణ శిరోమణి
సోదరీ సోదరులు:శ్రీమతి వెంకట రత్నమ్మ, శ్రీమతి లక్ష్మి కాంతమ్మ, శ్రీమతి లక్ష్మీ ఈశ్వరమ్మ,శ్రీ వెంకట రత్నం
విద్యాభ్యాసం:అమృతలూరు-సంస్కృత పాఠశాల,
చిట్టిగూడూరు-నారసింహ సంస్కృత కళాశాల,
ఉభయ భాషాప్రవీణ పరీక్షోత్తీర్ణత:1929 మార్చి
ఉన్నత పాఠశాలాధ్యాపకత్వము:1929-7-22
ఆంగ్ల కళాశాలాధ్యాపకత్వము :1957-6-25
భాషాపోషక గ్రంధ మండలి స్ఠాపకత్వము:1930
రచనలు:ముద్రితములి:47, అముద్రితములు:24
షష్టుత్సవ సమయము:1968జనవరి14,సంక్రాంతి
కళాప్రపూర్ణ:1974ఆగస్టు3 (ఆంధ్ర విశ్వవిద్యాలయము)
సంతతి: ఎనిమిది మంది-భాస్కర రావు,దివాకర దీక్షితులు,ప్రభాకరము,కమలాకరము,రత్నాకరము,శేషాద్రి శేఖరము,పద్మావతి, లీలావతి
స్థిర నివాసము:వెంకటేశ్వర నగర్, నిడుబ్రోలు, గుంటూరు జిల్లా

కొత్త సత్యనారాయణ చౌదరి పితామహుని పేరు శ్రీ వేంకట రత్నము. ఆయన మొదటి బిడ్డ బుచ్చయ్య చౌదరి. ఆయనకు యుక్త వయస్సు వచ్చినందాక ఆవంశము వారికి అభిజననము సంగంజాగర్లమూడి గ్రామము. బుచ్చయ్య సోదరులిర్వురు. ఆతమ్ముని పేరు సుబ్బయ్య. ఆ యిర్వురు బాల్యమందే తండ్రిని గోల్పోవుటం జేసియు, వారికేదో రవ్వంత మాతామహి ఆస్తిపాస్తులు వచ్చుట చేసియు, మాతామహి జన్మవాసమైన అమృతలూరు గ్రామమే వారికి కాణాచి యయ్యెను. అందువలననే సత్యనారాయణ చౌదరి తాను చిన్ననాడు వ్రాసికొన్న ఒకానొక పద్యములో, "మాది ‘అమర్తలూర’నెడి మన్నన చెందిన దిడ్డ గ్రామ"మని మురిసిపోయెను.
బుచ్చయ్య - రాజరత్నమ్మ దంపతులు కన్న సంతానము ఆరుగురిలో మగబిడ్డ లిర్వురు, వారిలో సత్యనారాయణ చౌదరి మొదటి వాడు,రెండవ యతడు వెంకట రత్నము కాగా సోదరీ మణులు వెంకట రత్నమ్మ,లక్ష్మీ నరసమ్మ, లక్ష్మి కాంతమ్మ, లక్ష్మి ఈశ్వరమ్మ.
ఈవంశంలో తరతరాలుగా ఆనాటికి దగిన చదువు సంధ్యలు గడించినవారు ఉన్నారనియు, పురాణములన్నను, పౌరాణికులన్నను, ధర్మమన్నను, దైవమన్నను, శ్రద్ధాభక్తులు కలవారు పెక్కులున్నారనియు ఆరోజులలో పుట్టిన వారి ‘వంశావళి’ యను పద్య గ్రంధమువలన గ్రహింపవచ్చును.
తే.గీ. ఘనుడు వేంకట రత్నాఖ్య తనయ వరులు
నిర్మలాత్ములు రసికులు ధర్మవరులు
యార్యపూజితులతి శౌర్యధుర్యులగుచు
ముఖ్యముగ బుచ్చయాఖ్య సుబ్బాఖ్యులమరె (౫౬)
(వంశానుక్రమణిక చరిత్ర నుండి)
ప్లవంగ నామ సంవత్సర మార్గశీర్ష-బహుళ-ఏకాదశీ మంగళవారములో సత్యనారాయణ చౌదరి జన్మించెను. అనగా ఆరోజు - పందొమ్మిది వందల ఏడవ సంవత్సరములో డిసెంబరు ముప్పది యొకటవతేది.

అల్పాల్పమైన ‘కొండ్రు’ సాగుజేసికొనుచు, స్వయముగా నేర్చిన ఏదో కొంత ‘జమా-కర్చు’ లెక్కల పరిజ్ఞానము చేతను, వ్యవహారదక్షత చేతను వ్యాపారసరణిలో దిగి కొంత సొమ్ము గడించి బుచ్చయ్య చౌదరి ఆగ్రామములో ఒక మంచి రైతుగా మన్నన కెక్కెను. బిడ్డల పెంపకములో, చదువు సంధ్యలు నేర్పించుటలో సంప్రదాయమును విడువక, సంస్కారము పాటించుచు పితృధర్మమును జక్కగా ఆచరించెననియే ఆయన సంతానము గర్వింతురు.

ఆరోజులలో ఇప్పటి వోలె ఇంగ్లీషు చదువులు అందఱకు అందుపాటులో ఉండెడివి కావు. జిల్లాలలో ఏరెండు మూడు చోట్లనో ఉన్నత పాఠశాలలుండుటయు, ఆచదువులకు బోవయునన్న వ్యయప్రయాసలు మిన్నగా ఉండుటయు కద్దు. ఇంచుమించు ఏబది యేండ్ల కు ( ఈ వ్యాస రచన 1964 సంవత్సరాన) మున్నే అమృతలూరు లో సంస్కృత పాఠశాలను నెలకొల్పిరి. ఆచదువులు అందఱకు దక్కవనియు, కొందరే వానిని జదువు కొందురనియు, అది పవిత్రమైన దైవ భాషయనియు, అది చదివిన వారికి సత్ప్రవర్తనమలవడుననియు, ఆభాష భారత జాతి నాగరికతకు మూలమనియు, భారతీయులలో ఆసేతుహిమాచలము అనేకత్వములో ఏకత్వమును గూర్చునది సంస్కృతమే అనియు, ఈదేశములో ప్రసిద్ధియున్నది. ఆదృష్టిలో తెలుగుదేశములో అమృతలూరు పౌరులు ఈపాఠశాలను స్థాపించి మంచి పని చేసిరనియే అభిజ్ఞులు మెచ్చుకొందురు.
నాలుగు కాసులు వెచ్చించి పాఠశాలను స్థాపించిరే కాని పాఠములు చెప్పువారెవ్వరు? అది యొక ‘సమస్య’ అయ్యెను. దేశములో ఈ పాఠములు చెప్పగలవారు లేరని కాదు, ఆచెప్ప నేర్చిన వారిని సత్కరించి ఆహ్వానించి పాఠశాలలో ప్రవేశపెట్టిన కొన్ని నాళ్ళకే ఏదో వంకతో వారు నట్టేట పుట్టి ముంచెడి వారు. ‘అబ్రాహ్మణుల’కు సంస్కృత విద్య చదువుటలో అర్హత ఉన్నదా? అని ప్రతి పండితునకు సందేహమే పుట్టెడిది. ఒక వేళ - ఆమాట పైకి చెప్పలేక, జీతనాతములమీద మమతచే ఎవ్వరో ఒకరు వచ్చి ఈకొలువులో కుదిరినప్పుడు ఊరిలోని ‘వాతావరణము’ కొంత కస్సుబుస్సు మని ఆపండితుని సాగనంపినదాక నిదురపోవని పరిస్థితి దాపరించెను.
ఆగ్రామంలో ‘రైతుపెద్ద’ ఒకరు ఈపరిస్థితిని గమనించి పాఠశాలా నిర్వహణమునకై నడుము కట్టెను. ఆయన పేరు శ్రీ పరుచూరు వెంకయ్య చౌదరి. ‘దేవుడు వెంకయ్య’ అని ఆయన గూర్చి వాడుక వున్నది. ఆయన మంచి వ్యవహార దక్షుడు, లోకజ్ఞుడును. ఆయన ముల్లు గఱ్ఱ మీద మొగము పూనిక చేసి దూరముగా నిలిచి వినుచున్నాడని తెలిసినపుడు, పౌరాణికుడు ఉన్న తెలివి పోయి పప్పులోకాలు వేయుట కద్దు. ఆయనకు సంస్కృతమన్నను, ఆయుర్వేదము మున్నగు ప్రాచీన విద్యలన్నను ఎంతో అభిమానము. ఆయభిమానము మూలముననే ఆయన పాఠశాలమీద కన్నువైచి రాయలసీమ నుండి విద్వాంసునొకని దీసికొని వచ్చి పాటశాలలో ప్రవేశపెట్టెను. గ్రాసవాసము లేర్పఱచినగాని ఈపండితులు నాలుగు కాలాలు నిలువరని పూర్వానుభవము వలన గుర్తించి ఆయనకొక ఇల్లు కట్టి యిచ్చెను. ఇంటిల్లపాదికి తగిన గ్రాసమిచ్చెడి పొలము కొంత ఆయన పేరబెట్టెను. ఆరైతు బ్రతికి యున్నంత వఱకు ఆపండితుని వలన ఆపాఠశాల చక్కగా సాగెను. ఆయిన పోయిన వెంటనే ఆపండితుడు ఆగ్రాసవాసములను చేతిలో బెట్టుకొని అనుభవించుచు ఆగ్రామము విడిచి పట్టణములో మకాము పెట్టి ఇంగ్లీషు బడిలో తిఛాఆయ్యెను. ఆయన పుణ్యమా యని పాఠశాలావిద్యార్ధులు పంచకావ్యముల దాక చదవ గలిగిరి. కాని అక్కడనే ఉన్నది అసలు సమస్య. ‘కౌముది’ ప్రారంభింపవలె. అది వ్యాకరణ శాస్త్రము గదా! శాస్త్రము జోలికి ఈపిల్లలు రారాదు గదా! రైతు పెద్ద పోయిన వెంటనే ఈసమస్య ఈతీరుగ దీర్చుకొని ఆపండితుడు తనపని తాను జూచుకొనెను.

ఈఘట్టములో కొన్నాళ్ళకు ఆయూరి వారి అదృష్టవశమున దాక్షిణాత్యులయిన పండితులొకరు పాఠశాలకు దక్కిరి. ఆయన అప్పుడే మైలాపూరు సంస్కృత కళాశాలలో ‘మీమాంస శిరోమణి’ లో ఉత్తీర్ణులయి అధ్యాపక వృత్తికి సిద్ధముగా ఉండిరి. ఆయన పేరు కంబంపాటి స్వామినాధ శాస్త్రి గారు. వారి పూర్వులు దక్షినాదికి వలసపోయిన తెలుగువారు. ఆయన అమృతలూరు పాఠశాలలో అడుగు వెట్టిన వెంటనే ఊరిలో ‘బ్రాహ్మణ్యము’ చేయగలిగినంత అలజడి జేసిపెట్టిరి. దానికా శాస్త్రివర్యులు అదరక బెదరక స్తిమితముగా నిలిచిపోయి చిరకాలము పాఠశాలను జక్కగా పెంచి ఎందఱనో శిష్యులను సిద్ధము చేసెను. ఆయన పెట్టిన బిక్ష వలననే సత్యనారాయణ చౌదరి వంటి విద్యార్ధులు ఎందఱెందరో రెక్కలు వచ్చి విద్యాగంధము రవ్వంతైన మూచూడగలిగిరి. ఆ బ్రాహ్మణ్యులు ఈప్రాంతము వారికి గావించిన అత్యంత సహకారమును మనస్సులో భావించుకొని సత్యనారాయణ చౌదరి తాను సంస్కృతములో వ్రాసిన ‘శకుంతలా’ గ్రంధమును ఆయన గారి కంకితమిచ్చి ఋణములో రవ్వంతైన దీర్చుకోగలిగితినని సంబరపడును.

సంయుక్తాంధ్ర మద్రాసు రాష్ట్రములో పళ్లెటూళ్లలో ఉన్న సంస్కృత పాఠశాలలో అమృతలూరు పాఠశాలకు మంచి పేరు ప్రతిష్ఠలున్నవి. అర్ధ శతాబ్దికి పైగా ఆప్రాంతము వారెందరో పంచకావ్యముల దాక అందే చదివి పేరుగడించిరి. ‘బాపూజి’ ఉద్యముల వంటి అనేక మహోద్యములకు సైతము పరోక్షముగా ఆ పాఠశాల అనుబంధము కలిగియుండెడిదని చెప్పవచ్చును. ఆడుపిల్లలతో సైతము సంస్కృతవిద్య అంతో ఇంతో లభించినదన్న ప్రఖ్యాతి ఆరోజులలో అమృతలూరు గ్రామమునకే దక్కినది.

ఈరచయిత ఆ పాఠశాలలో ఆఱేండ్లు సంస్కృతము చదివి ‘ప్రవేశ పరీక్ష’ లో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడయి ఆవల బందరు పరగణాలో ఉన్న చిట్టిగూడూరు నారసింహ సంస్కృత కళాశాలలో జేరెను. అక్కడ గురుకులవాసముగ నాలుగేడ్లు గడిపి1929 మార్చిలో ‘ఉభయ భాషాప్రవీణ ఎ’ పరీక్షలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యెను. ఆసంవత్సరమే జూన్ 25 తేదిన గుంటూరు జిల్లాబోర్డు హైస్కూలులో ఉపాధ్యాయ పండితుడుగా ఉపక్రమించి అయిదాఱు ప్రసిద్ధములైన హైస్కూళ్ళలో ఇరువది ఎనిమిదేండ్లు అవిచ్ఛిన్నముగా పనిచేసెను.1957 వ సంవత్సరము లో జిల్లాబోర్డు ఉద్యోగమును విడిచివైచి, నిడుబ్రోలు పి.బి.ఎన్ కాలేజిలో తెలుగు లెక్చరరుగా జేరి ఏదో కొంత భాషాసేవతో పాటు ఈరచయిత కాలక్షేపము చేయుచున్నాడు.
పుస్తక రచన:

1928-29 సంవత్సరములలో సంస్కృత కళాశాలలో సంస్కృత భాషాచరిత్ర, వాజ్ఞ్మయ చరిత్ర పాఠ్యముగా విన్న అంశములను శ్రద్ధగా వ్రాసి పెట్టుకొని దానికొక ఆకృతి ఇచ్చి 1931 లో ‘వైదిక వాజ్ఞ్మయచరిత్ర’ అన్న పేరుతో తొలి గ్రంధముగా ఈరచయిత వ్రాసి అచ్చు వేయించెను. అది సంస్కృత కళాశాలలలో ‘విద్వద్బిరుద’ పరీక్షలకు పాఠ్యముగా అక్కఱకు వచ్చినది. ఆరోజులలో అచ్చునకై ఆపుస్తకమునకు ఆరువందల రూప్యములు కర్చుపెట్టి, ఇంటిలో తండ్రిగారికి సైతము చెప్పక ముద్రించుట జేసి, కొంత ‘వ్యసనము’ కలిగి, వెంటనే పాఠ్యపుస్తకములు కొన్ని వ్రాసి ఆయప్పు తీర్చి తన్మూలమున గ్రంధరచనోద్యమములో ఉత్సాహము పెంచుకొనెను. హైస్కూళ్ళలో పిల్లలకు కేవలము పాఠాలు చెప్పుటయేగాక, ప్రత్యేక వ్యాసంగముగా గ్రంధ పఠనము చేయుచు, నిత్యకృత్యముగా కొంత ‘రచన’ అభ్యాసము చేయుచు, ‘వైదిక వాజ్ఞ్మయచరిత్ర’ తోపాటు గ్రంధ మడలి యొకటి ‘స్వయంరాజా స్వయం మంత్రి’ అన్నట్లు తానే స్థాపించుకొనెను. దాని పేరు ‘భాషాపోషక గ్రంధ మండలి. దాని ఉనికిమనుకుల తీరు తియ్యములివిగో - ఇవి: "ఆంధ్ర భాషాయోషకుససియగు బలుపు నాకాంక్షించి ఈగ్రంధమండలిని వెడలించితిమి. ఏతన్మూలమున అతివిశాలమగు సంస్కృతవాజ్ఞ్మయముపైని పాశ్చాత్య పండితులు వెలయించిన విమర్శనములను ప్రదర్శింతుము. స్మృతులు పురాణములులోనగు వానిలో విశిష్టములగు వానిని అందఱికవగాహమగునటుల తేట తెలుగున వివరింతుము. సరసములగు సంస్కృతాంగ్ల గ్రంధములను ఆంధ్ర బాలురకు ఉపయుక్తమగు వానిని బయలు పఱతుము. బాలికా బాలకులకు సాహ్యపడు పద్యగద్య కావ్యములను - ‘కలిపురాణ’శ్రేణిలో ప్రకటింతుము. సంపాదకుడు,సర్వాధికారి: సత్యనారాయణ చౌదరి".

ఇట్టి సంకల్పముతో ముప్పదినాలుగేంద్లనుండి ఏదో తోచినట్లు పద్యములో గద్యములో రచన చేయుచు దరిదాపు డెబ్బది గ్రంధములను ఈరచయిత ఒక రూపునకు దెచ్చెను. వానిలో ఇప్పటికి ముప్పది యేడు మాత్రమే ముద్రితములు. ఇంటిలో ఎదిగియుండి అవివాహితలైన ఆడుపిల్లల వోలె తక్కినరచనలు అచ్చు కోసమెదురు చూడవలసిన అక్కఱ కల్గుచున్నది.

ఈరచయితకు భాషాప్రపంచములో అభిమానమూర్తి పరవస్తు చిన్నయ సూరి. సూరివంశమునకే తలమానికమైన చిన్నయ్య ఆంధ్రికి పెట్టిన భిక్ష ఇంతయంతయని చెప్పలేము. కొలమును బట్టి ఆమహావ్యక్తిని తక్కువచేసి తన్మూలమున తెలుగు వాజ్ఞ్మయమునకే అపరాధము చేసిన విద్వాంసులు మన దేశములో వున్నారు. ఆ విషయమై ఈరచయిత తనకు దోచిన ఆధారములతో ‘చిన్నయ’ అన్న పేరుతో ఒక చిన్న రచన చేసి తెలుగువారికిచ్చెను. ఇతర విద్వాంసులెందఱో పనిపూని నడుముకట్టి చిన్నయ సూరి కీర్తిమూర్తికి కళంకము తేవలెనని ప్రయత్నించినను, చిన్నయ హృదయమును చక్కగా గ్రహించి ఏబది యేండ్లుగా శిష్యకోటికి సూరి రచనలు బోధించుచు తాము గుర్తించిన సత్యమును నిరాఘాటముగా లోకమునకు వెల్లడి చేసిన మహావిద్వాంసులు బ్రహ్మశ్రీ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి వర్యులను ఈఘట్టములో పేర్కొననిచో కృతఘ్నతయే కావచ్చును. సంస్కృత భాషలో ‘కౌముది’కి ఈడుజోడు కాగలిగి తెలుగులోపుట్టిన సర్వ వ్యాకరణములకు మేలుబంతియైన బాలవ్యాకరణమునకు సమీక్షగా ‘రమణీయమను’ బృహద్గ్రంధమును రచించి దువ్వూరి వారు తెలుగువారికి జేసిన మహోపకారము ఇంతింతకాదు. ఆశాస్త్రి వర్యుల ముఖ్య శిష్యులలో ఒకడుగా ఉండనోచితినని ఈరచయిత అనుక్షణము సంబర పడుచుండును.

పూర్వ వాజ్ఞ్మయములొ కులగోత్రాలపేరుతో జాతిమతముల వంకతో కావలసినన్ని కల్మషములు పుట్టి పెరిగి- అదియొక సంప్రదాయముగా సనాతనాచారముగా వర్ధిల్లి తన్మూలమున పీడుతులైన వారికి సైతము అదే ఉపాస్యమన్న ధోరణిలో వెలసినది. ఈదేశములో ఈరహస్యమెఱిగినవారు ఎందరో ఉన్నను, రచనలో కవితలో నిబ్బరముగా నిరాటంకముగా బయటపెట్ట నేర్చిన దిట్ట ఒక్క త్రిపురనేని రామస్వామి చౌదరి యనియే చెప్పవలెను. ఆత్రోవలో వ్యాసంగము చేసి ఆ రహస్యములను మఱికొన్నింటిని గుర్తించి ఆవంకకే కలము త్రిప్పి ఈరచయిత ‘కలిపురాణ’ శ్రేణిని వెలువరింప సాగెను. ‘కలిపురాణ’మన్న పద్యకావ్యము ఇంతవఱకు అయిదు భాగములుగా వెడలినది.

వర్ణాశ్రమ ధర్మమన్నపేరిట సనాతనాచారమన్న ధోరణిలో అవకాశము కలిగినప్పుడెల్ల తెలుగులో ‘విశ్వనాధ వారు’ వ్రాసెడి వ్రాతలు చదివి ఏవగించుకొనువారు నూటికి ఎనుబదిమందికి పైగాఉన్నను, వ్రాతలో వానిని ఖండించువారు ముందునకు రారైరి. ఆయనకేదో ఇంత ప్రతిష్ట ఉన్నదన్న భ్రమచేత -ఆయన నోటినుండి వచ్చిన మాటలకెల్ల ‘భజగోవిందము’ పాడు శిష్య పరమాణవులు కొందరు పిల్లగంతులు వేయుచుండుట చేత, అధికారికముగా సాంఘికముగా రాజకీయముగా ఏవేవో ఇబ్బందులున్నవన్న స్వార్ధముచేత విశ్వనాధ వారి రచనల లోని అవకతవకలను దెలిసియు గొందరు గ్రందస్ధము చేయరు. విషయమందే గాక రచనలో శయ్యలో శాబ్దికముగా ఆర్ధికముగా ఆయన చేసెడి దోషములు లక్షలుగానున్నను ఉపేక్షవహించుటయే విద్వాంసులనేకులకు ఆచారమైనది. శ్రీమద్రామాయణకల్పవృక్షము మహాకావ్యమనియు, కవిత్రయము వారు పోతనామాత్యులు భారత,భాగవములను తెలుగునకు దెచ్చిరేగాని, వాల్మీకమునకనువాదము నేటి వఱకు సరియైనది రాలేదనియు, ఆలోపము ‘వైశ్వనాధము’తో తీరినదనియు, వాల్మీకమునకీకల్పము అచ్చముగా భాష్యమువంటిదనియు, ప్రసిద్ధులైన సంస్కృతాంధ్రమహాకవులనేకులు పోవని పోకడలు ఈకల్పవృక్షములో వున్నవనియు, శ్రీనాధాదులనే గాక వాల్మీకిని సైతము ఈగ్రంధకర్త ఒకవిధముగ రచనలో మించెననియు, విశ్వనాధ వారి బృందముతో బాటు విశ్వనాధులవారికి ఈభావమున్నట్లు ఉపన్యాసముల వలన ప్రసంగముల వలన స్పష్టమగుచున్నది. ఈభావమే ప్రకోపించి ఎదురెవ్వరు లేరన్న ధీమాతో, భాష్యమనివంకపెట్టి వాల్మీకమును వికృత పరచి అందలి పాత్రలను అపాత్రలను జేసి, లాక్షణికముగా లక్షోపలక్షలుగా అపభ్రంశములు కావించి తెలుగు మర్యాదనే చెఱచి, ఛందస్సునే విఱిచి, విశ్వనాధవారు యదేచ్ఛముగ సంచరించిన ఘట్టములనేకములున్నవి. ‘విశ్వనాధ పంచశతి’ పేరుపెట్టి ఆయన వ్రాసిన అయిదు వందల పద్యములలో బూతులెన్నెన్ని కలవో, జాతి నింద, వర్గ దూషణ ఎంతెంత కలదోసోపపత్తికముగా ఈరచయిత వ్రాసియుండెను. దాని పేరు ‘పంచశతీ పరీక్ష’. తీరిక లేని వారు, ఓపిక చూపలేని వారు, విశ్వనాధ రచనలు అన్నింటిని జూడవలసిన పనిలేదు. ‘పంచశతీ పరీక్ష’ అనెడి ఈచిన్న సమీక్షను జూచిన జాలు, ఆయన తత్వము అక్షరాల ఆరచనలో ప్రతిబింబించి కన్నులకు గట్టినట్లు స్పష్టమగును. వాల్మీకమొక చేతిలో బెట్టుకొని ‘కల్పవృక్షము’ను ప్రత్యక్షరము పరిశీలించి చూడగా తెలుగు బాసకు ఆయన చేసిన ద్రోహము, వాల్మీకి మహర్షికి ఆయన కావించిన అపచారము వ్యక్తము కాగలదన్న భావముతో ఈరచయిత ‘కల్పవృక్షఖండన’మని పేరు వెట్టి తెలుగువారి కెఱుక పఱిచెను. ఇదే ధోరణిలో ‘వేనరాజు - వేయిపడగ’లను గూడ పరీక్షలో పెట్టి ఆయన తత్త్వము స్పష్టపఱుపవలెనన్న సంకల్పముతో ఈ రచయిత కృషి చేయుచున్నాడు.

ఇక అధ్యాపక వృత్తి:

1929 లో హైస్కూలులో ఉపాధ్యాయుడుగా జేరి ఇరువది ఎనిమిదేండ్లు చేసిన బోధకు - కృషికి - కాలేజి ప్రవేశము మిక్కిలిగా సహకరించినదని ఈ రచయిత భావము. ఆచదువులకు ఈచదువులకు అంతరమెంతో ఉన్నందువలనను కఱువు తీరునట్లు కవిత్రయము వారి రచనలు గాని, లాక్షణిక భాగములుగాని ప్రసిద్ధ ఘట్టములెన్నో కాలేజిలో పాఠ్యములుగా ఉండుటవలన ఈరచయిత గ్రంధరచనోద్యమమునకెంతో స్థాయి చిక్కినదని చెప్పవచ్చు. రచనకు గావలసిన గ్రాసమే గాక విశ్రాంతియు మిక్కిలిగా దొరుకుటచే దినదినాభ్యుదయముగా ఏదో కొంత భాషాసేవ చేయుటకు అవకాశము చిక్కినది.

అడ్డమైన దేవిరిగొట్టు నాశ్రయించి లాతివారి పడిపంచలబడి యాచించి సొమ్ము తెచ్చి వ్రాసినవి అచ్చువేయించు కొనుటలో మనసొప్పని ఈరచయిత చీమవోలె కూడ బెట్టిన ఆరవ్వంత సొమ్మునే ఆధారము చేసికొని అనువైనవేళలో అచ్చుపని జూచుకొనుటయే సంప్రదాయమైనది. దేశమునకో, భాషకో, రాజకీయములకో, కళలకో, జీవితమంకితమిచ్చిన వ్యక్తులకే ఈరచయిత రచనలు కొన్నిఅంకితమైనవి. ఈ ఘట్టములో గురువులకు, తల్లిదండ్రులకు, ముమ్మొదటనే పెద్ద పీటలు వేయుట సంభవించినది. తనకు దోచిన ధోరణిలో తనయిలువేల్పగు శ్రీనివాసునకు ఈరచయిత కొన్ని రచనలు సమర్పించుకొనెను.

ఇటీవల వయస్సుతోపాటు అనారోగ్యము పెరిగి అకటావికటలు చేయుచున్నను, సాంసారిక వ్యాపకములు వెంటబడుచున్నను,అధ్యాపక వృత్తిలో అంతగా విశ్రాంతిదొరకకున్నను, చిరకాల సంప్రదాయముగా అనుస్యూతముగా వచ్చుచున్న ‘భాషాకృషి’ విడిచిపెట్టలేదన్న సంబరము ఈరచయితకు మిక్కిలిగాగలదు. గద్యమో పద్యమో వ్యాసమో ఏవో ఇన్ని ముక్కలు వ్రాయని వారము ఈరచయితకు నిట్రుపాసన వంటిది. వేసవి సెలవులలో ఏదో ఒక రచన ఆకృతికి వచ్చి అచ్చునకెదురు చూడవలెనన్నదే ఈ రచయిత దీక్ష. చేసిన రచనలలో అనేకములు పునర్ముద్రణకెదురు చూచుచుండగా, కొంగ్రొత్తవి కంటికెదురై వ్రాతలో బంధింపబడి ఉండవలసి వచ్చుచున్నది. అయినను పరమేశ్వరానుగ్రహము వలన ఈజీవితములో ఈచేతిలో సాగిన రచనలన్నియు అచ్చునకు రావచ్చుననియే ఏదో మొండి ధైర్యములో ఈరచయిత నిలిచియుండును.

పాఠకుల పరిశీలము కోసమై ఈరచయిత కావించిన రచనలు పేర్కొనుట అప్రస్తుతము కాదనుకొందుము.
(రచయిత కొత్త సత్యనారాయణ చౌదరి గారి మనోభావాల అక్షర రూపమైన ఈరచన తేది 25-5-1964 )

కొత్త సత్యనారాయణ చౌదరి గారి రచనలు
మొత్తము రచనలు:71 ముద్రితములు:47 (1974)
. వైదిక వాఙ్మయ చరిత్ర ౨.సతీసప్తతి(పద్య) ౩.కధా వింశతి ౪.చంద్రా పీడచరిత్ర ౫.కామ శాస్త్రము(వాత్స్యాయన మహర్షి ) ౬.కావ్యమాల ౧వ భాగము ౭. కావ్యమాల ౨వ భాగము ౮.సుభాషితము ౯.ధర్మశాస్త్రము(మనుస్మృతి) ౧౦.కవుల కధలు ౧౧.వరరుచి ౧౨. ఈశ్వర సేవకులు ౧౩. విక్రమ కధలు ౧౪. మ్రొక్కుబడి(పద్య) ౧౫. నవనాధము(గద్య) ౧౬. బృహత్కధలు ౧౭.వత్సరాజు ౧౮. విక్రమాదిత్యము ౧౯. సాలభంజికలు ౨౦. బాపూజీ (పద్య) ౨౧. చారుదత్తము ౨౨. నీతిచంద్రిక(సవ్యాఖ్య) ౨౩. చిన్నయ్య (సూరి చరిత్ర) ౨౪. నైషధము ౨౫. కలిపురాణము (పద్య) ౨౬. ప్రతాపసింహము ౨౭. వీరపూజ ౨౮. చాణక్యము ౨౯. దివ్యమూర్తులు ౩౦. స్వరాజ్య కధలు ౩౧. మాయాభిక్షువు (పద్య) ౩౨. కలిపురాణము (౨వ భాగము) ౩౩. మాస్వామి (పద్య) ౩౪. మంజరి (పద్య) ౩౫. జాతక కధలు ౩౬. సైరంధ్రి (గద్య) ౩౭. పంచశతీ పరీక్ష (విశ్వనాధ వారి పంచశతికి విమర్శనము) ౩౮. కవిరాజు (త్రిపురనేని) ౩౯. షష్టిక (పద్య) ౪౦. సాహితి(వ్యాసములు) ౪౧. రామాయణ రహస్యాలు ౪౨. మోహన దాసు (పద్య) ౪౩. వసంతసేన (రూపకము) ౪౪. కులపతి (శ్రీ వరదాచార్య) ౪౫. కల్పవృక్ష ఖండనము ౪౬. పంచదశీ (శ్లోకములు) ౪౭. శకుంన్తలా (సంస్కృత రచన)
అముద్రితములు: ౪౮. కలిపురాణము (౩వ భా.పద్య ) ౪౯. కలిపురాణము (౪వ భా.పద్య ) ౫౦. కలిపురాణము (౫వ భా.పద్య) ౫౧. ధూర్తుని స్వగతం ౫౨. మేవాడ విజయము (గద్య) ౫౩. మహారధులు ౫౪. అంజలి (పద్య) ౫౫. లోకతంత్రము(పద్య) ౫౬. స్వరాష్ట్ర్రము (పద్య) ౫౭. త్యాగయ్య ౫౮. రామరాజభూషణము ౫౯.మాలిక (పద్య) ౬౦. కావ్య కధలు ౬౧. తెలుగు వెలుగులు ౬౨. చిత్ర కధలు ౬౩. కవిత్రయము ౬౪. పండితుడు (పద్య) ౬౫. శిశుఘ్ను(పద్య)౬౬. తెనుగు లక్షణము ౬౭. నా యుపాధ్యాయ గిరి ౬౮. బాలప్రౌఢ ప్రశ్నోత్తరమాల ౬౯. సూక్తి ముక్తావళి ౭౦. వినోద కధలు ౭౧. వాల్మీకము
..........................

మా గురుపాదులు రచన:శ్రీ ఆరి శ్రీరామ మూర్తి (నిడుబ్రోలు)

ఎత్తైన విగ్రహము, మంద హాసమొలికించు మోము, సన్నగ బక్కపలుచగ నుండి చూపరుల దృష్టిని ఆకర్షించెడి మూర్తి సత్యనారాయణ చౌదరి గారిది. సమయస్పూర్తి, చలోక్తులు వారికి పెట్టని కోటలు. పండితుడు, కవి, వ్యాకరణ వేత్త, విమర్శకాగ్రేసరులుగా సాహితీ జగత్తునకు సుపరిచితులు. అధ్యాపకులుగా విద్యార్ధుల మన్ననలను పొంది, సాహితీవేత్తగా సాహిత్యాభిమానుల హృదయములను చూఱగొని, ఉద్దండ పండితుడని పండితులచే పొగడ్తలను గని, కవిగా ౭౦కి పైగా గ్రంధములను వెలయించి, రామాయణ కల్ప వృక్ష గ్రంధ విమర్శనముచే ఆంధ్రదేశమందలి సాహితీ ప్రియులనందరిని ఉర్రూతలూగించి, నిర్ద్వందముగ విమర్శించు విమర్శకాగ్రేసరుడని ఖ్యాతి చెంది, గజారోహణాది సన్మానములంది, కార్యదీక్షా దక్షులనిపించుకొనిన సత్యనారాయణ చౌదరి గారు మాగురుపాదులు.

పూవు పుట్టగానే పరిమళించునట్లు పిన్ననాటనే సాహిత్యాభిలాషియై కవిత్వము వ్రాయుట నేర్చి, గ్రంధములను ప్రచురించి, సాహితీ పోషణయే జీవిత లక్ష్యముగ భాషా పోషక గ్రంధమండలిని నెలకొల్పిన సాహితీ సంఘసేవకులు చౌదరి గారు.

చౌదరి గారు విద్యార్ధులను కన్నబిడ్డలకన్నా మిన్నగ ప్రేమించుచు, సాహిత్యమునందలి లోతుపాతులను తెలియజేసి వారికి సాహిత్యాభిరుచిని కలిగించెడివారు. నా అనుభవములో వారు వ్యాకరణ పాఠము చెప్పిన మరల చదువవలసిన అవసరము లేకుండెడిది. మనస్సునకు హత్తునట్లు చెప్పుటలో వారికిగల నేర్పు అనితర సాధ్యము. వ్యాకరణమనిన భయపడు విద్యార్ధులు సహితము వారు వ్యాకరణమును బోధించిన తీరును చూచి ఊరట చెందెడి వారు.

చౌదరి గారిని కుటుంబ పోషణ భారము-సాహితీ సంసేవనము-అధ్యాపక వృత్తి-పండితులతో వాగ్యుద్ధము- సాహిత్య సభలు- రెడియో కార్యక్రమముల కంటే దేహ క్లేశము మిగుల బాధించినను దానిని ఏమాత్రము లెక్కగొనక సాహిత్య జీవితమే లక్ష్యముగ జీవనమును సాగించిరి. గురువుల ఆదరాభిమానములు పొంది, గురువులను మించిన శిష్యుడని పేర్గాంచి, వారి జీవిత చరిత్రను గ్రంధముగ వ్రాసి, గురుదక్షిణ నొసంగి గురు ఋణ భార విముక్తుడైన మహామనీషి సత్యనారాయణ చౌదరి గారు. పెద్ద చిన్న భేదము లేక తప్పులను ఎత్తి చూపుచు, మంచిని అందించెడి స్వభావము కలవారు మాగురుపాదులు.

రామరాజ భూషణుడు వారి అభిమాన కవి. ‘వసుచరిత్ర’ వారి అభిమాన గ్రంధము. ఆ కారణముగా చౌదరి గారు భువన విజయములో రామరాజ భూషణని పాత్ర నిర్వహించెడివారు. చిన్నయసూరి గారి గద్యము వీరికి ప్రీతి పాత్రమైనది. సూరి గారి గద్యమును అభిమానించినను చౌదరి గారి గద్యము కృతకము గాక సులభతరమై జన బాహుళ్యమున కందుబాటులో నున్నందున వారు గద్య నిర్మాతలుగా అందరి మన్ననలకుపాత్రులైరి. దైవము చిన్నచూపు చూచుట వలన అకాలమున మనను వీడిపోయిరి. కాని బ్రతికి యుండిన ఆధునిక గద్య కవి బ్రహ్మ బిరుదు నందియుండెడి వారనుటలో సందియము లేదు.

ఆంధ్ర విశ్వకళాపరిషత్ చౌదరి గారి సాహితీ సేవలను గుర్తించి, వారికి కళాప్రపూర్ణ గౌరవబిరుదము నొసంగి సన్మానించినది. రామాయణముపై వారొనర్చిన కృషిని గమనించి విశ్వవిద్యాలయము వారు వారిని రంగనాధరామాయణ పరిశోధనా గ్రంధ పరీక్షకునిగ నియమించిరి. కాని మనమా భాగ్యమునకు నోచుకొనకయే వారు కన్నుమూసిరి. చౌదరి గారు మనలను వీడిపోయినను వారి సమయస్పూర్తి, చలోక్తులు మనమఱపునకు రావు. ప్రత్యేకముగా వారు నా పట్ల చూపిన ప్రేమాభిమానములు నన్ను వారినుండి వేరుచేయలేవు. వారు లేని కొఱత నాకు తీరని లోటు. చౌదరి గారి ఆత్మకు శాంతి కలుగవలెనని భగవంతుని ప్రార్ధించుచున్నాను.
(రచయిత శ్రీ శ్రీరామ మూర్తి - చౌదరి గారి పూర్వ విద్యార్ధి, మరియు వారు పనిచేసిన పి.బి.యన్. కళాశాలలోనే తెలుగు శాఖాద్యక్షులుగా పనిచేసిరి.)


చౌదరి గారి మాతృమూర్తి రాజరత్నమ్మ గారు
( ఆంధ్రభూమి 7 ఏప్రియల్ 2008 )

చౌదరి గారి ధర్మపత్ని వెంకట సుబ్బమ్మ గారు



బహుముఖ ప్రజ్ఞాశాలి :
కొత్త సత్యనారాయణ చౌదరి శత జయంత్యుత్సవ సభలో పలువురు ప్రముఖుల నివాళులు

(భావవీణ జులై 2007 సంచిక ) ప్రసిద్ధ కవి, పండితుడు, విమర్శకుడు, కళాప్రపూర్ణ కొత్త సత్యనారాయణ చౌదరి గారి శత జయంతి సభ పొన్నూరు రొటరి కమ్యూనిటి హాల్ లో , "పొన్నూరు కళాపరిషత్ " అధ్వర్యంలో ౨౦౦౭ జూన్ ౧౭ వ తేదీన ఘనంగా జరిగింది. పొన్నూరు కళాపరిషత్ అద్యక్షులు శ్రీ యస్. ఆంజనేయులు నాయుడు గారు సభాద్యక్షత వహించగా, శ్రీ పి. కృష్ణ స్వాగతం పలుకగా,ముఖ్య అతిధి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య వి . బాల మోహన దాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.

శాసన సభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు సి.డి ని ఆవిష్కరిస్తున్న చిత్రం


సభాద్యక్షులు స్వాగతం పలుకుతూ ఎంతో ప్రాచీన చరిత్ర గల తెలుగును సుసంపన్నం చేసిన వారిలో కొత్త సత్యనారాయణ చౌదరి గారు పేరెన్నిక గలవారు , ప్రాతఃస్మరణీయులు అంటూ, వారు ఈప్రాంతానికి చెందినవారు కావడం మన అదృష్టం అన్నారు. సమాజానికి వారు చేసిన సాహితీసేవలను స్మరించు కోవడానికి ఈసభను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. చిన్నయ సూరి ద్విశత జయంతి, చౌదరి గారి శతజయంతులను పురస్కరించుకొని , చౌదరి గారు చిన్నయసూరి నీతి చంద్రికకు వ్రాసిన టీకను పునర్ముద్రించిన ద్రావిడ విశ్వవిద్యాలయానికి , ముఖ్యంగా కులపతి ఆచార్య జి. లక్ష్మినారాయణ గారికి ,సత్యనారాయణ చౌదరి గారి కుమార్తె శ్రీమతి కొత్త పద్మావతి కృతజ్ఞతలు తెలియ చేసారు. నీతిచంద్రికను ఆచార్య వి. బాల మోహన్ దాస్ ఆవిష్కరించారు.

కొత్త సత్యనారాయణ చౌదరి గారి కుమారుడు డాక్టర్ శేషాద్రి శేఖరం నాన్న గారిని గూర్చి నాలుగు మాటలంటూ, "ఫాదర్స్ డే" నాడు ఈకార్యక్రమం జరగడం తమ అదృష్ట మన్నారు. తండ్రి పాత్రను సమర్ధవంతంగా నిర్వహించిన నాన్న గారు ఆదర్శ అధ్యాపకులుగా, సాహితీవేత్తగా విశేష సేవలందించిన ధన్యులన్నారు.
చౌదరిగారి రచనలు, వ్యాసాలు, ఫొటోలతోకూడిన సి.డి ని స్థానిక శాసన సభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఆవిష్కరించారు.
ఈకార్యక్రమంలో ఆత్మీయ అతిధిగా పాల్గొన్న వికాస్ విద్యాసంస్థల డైరక్టర్ శ్రీ పి.వి.శంకర రావు, చౌదరిగారి శిష్యునిగా గురువుగారితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తల్లిదండ్రులు తమకు ఆస్తులేమిచ్చారని బిడ్డలు ప్రశ్నిస్తున్న ఈరోజుల్లో,మూడు దశాబ్దాల క్రితం కీర్తిశేషులైన తమ తండ్రిగారిని గౌరవ భావంతో స్మరించుకొంటున్న కుటుంబ సభ్యులు ధన్యులని శంకర రావు గారు అన్నారు. తమవంటి వారెందరికో తమ గురువులయిన చౌదరిగారు క్రమ శిక్షణ అలవరిచారని,విద్యార్ధులను ఆలోచింప చేసేవారని, పాఠ్యాంశాలతో
పాటు అనేక విషయాలను తెలియచేస్తూ విశ్వదర్శనం చేయించేవారని, విద్యార్ధి సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించే ఆదర్శ అధ్యాపకులని అభివర్ణించారు. చౌదరిగారి వంటి వారు మళ్ళీ మళ్ళీపుట్టాలని కోరుకుంటున్నానని పలుకుతూ శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కవిత్వంలో విప్లవం,అభ్యుదయం ఉన్నాయని,కొందరు అపోహ పడుతున్నట్లు ఆయన ఏవర్గానికి వ్యతిరేకి కాదని,సనాతన ధర్మాల పేరుతొ అనాచారాలను ప్రోత్సహించే అనాచారులను మాత్రమే ఆయన వ్యతిరేకించారని శంకర రావు గారు వివరించారు.
గౌరవ అతిధులుగా కార్య్క్రమంలో పాల్గొన్న ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం తెలుగు ఆచార్యులు ఆచార్య జి. కృపాచారి మాట్లాడుతూ, తమ గురువులు ఆచార్య తూమాటి దోణప్ప గారి వలన కొత్త సత్యనారాయణ చౌదరిగారిని గురించి తెలుసుకొనే అవకాశం కలిగిందన్నారు. ఆయన స్పృశించని సాహిత్య ప్రక్రియ లేదని, వీరి వంటి బహుముఖ సాహితీపటిమ కలిగిన వారు అరుదన్నారు. చక్కని పద ప్రయోగాలతో, సామాన్యులకు కూడ అర్ధమయ్యే రీతిలో మాస్వామి, మంజరి వంటి రచనలు చేసారని, వారి పద్యాలలో భాషావిశేషాలు,చక్కని ఛందస్సంప్రదాయం, రసం, ధ్వని, అద్భుత అలంకారాలు కన్పిస్తాయని అంటూ సోదాహరణంగా వివరించారు.
తెలుగు పండితులు శ్రీ ఎన్.వి.ఆర్.ప్రసాద్, చౌదరిగారిపై వ్రాసిన పద్యాలను చదివి వినిపించారు.
గౌరవ అతిధి ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు ప్రొ. పి.సుబ్బారావు ప్రసంగిస్తూ చౌదరి గారు రాజసంతో కూడిన వ్యక్తిత్వం కలవారని, తాము నమ్మిన సిద్ధాంతం విషయంలో ఎవరికే వెరవని ధైర్యశాలని, తమ ప్రతి రచన లోను గురు స్మరణ చేస్తూ గురు భక్తిని చాటిన ఆదర్శ శిష్యుడని, నలభై సంవత్సరాల పాటు అధ్యాపకుడుగా ఎందరినోతీర్చిదిద్దిన ఆదర్శ అధ్యాపకులని పేర్కొన్నారు.

నాటిరోజుల్లో త్రిపురనేని భావవిప్లవం, గిడుగు వారి భాషావిప్లవం, తిరుపతి వెంకట కవుల అవధాన ప్రక్రియ, కందుకూరి వారి సాంఘిక సంస్కరణ, రాయప్రోలు జాతీయోద్యమం, దేవులపల్లి భావవిప్లవం తెలుగు నేల నాలుగు చెరగులా వ్యాపించి ఉండగా, ప్రభావితులైన చౌదరి గారు బహుముఖ ప్రజ్ఞాశాలని అభివర్ణించారు. జీవితమంతా కూడబెట్టిన బీమా సొమ్మును కూడా పుస్తక ప్రచురణలకే వినియోగించుకొని, ఎవరికీ చేయిచాపని రాజసం ఆయనలో కనిపిస్తుందని అన్నారు. వారి కల్పవృక్ష విమర్శ, రామాయణ రహస్యాలు చదివిన తర్వాత తనకు విమర్శ, పరిశోధన,ఆలోచనా విధానం, ఎలా ఉందాలో దిశానిర్దేశం ఏర్పడిందని ఆచార్య సుబ్బారావు గారన్నారు.
స్థానిక శాసన సభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఈశతజయంతి సభ వలన మన ప్రాంతానికే చెందిన చౌదరి గారి గొప్పతనం,ప్రతిభ తమ వంటి యువకులకు తెలుసుకునేఅవకాశం కలిగిందన్నారు. సాహితీవేత్తగా ఎన్నో గ్రంధాలు రచించి, సాహితీ రంగం లో అన్ని కోణాలను స్పృశించి, తమదైన శైలిలో గుర్తింపు తెచ్చుకొన్న సాహితీవేత్త సత్యనారాయణ చౌదరి గారు చిరస్మరణీయులని నరేంద్ర కుమార్ అన్నారు.
ముఖ్య అతిధి ఆచార్య వి. బాల మోహన్ దాస్ ప్రసంగిస్తూ కొత్త సత్యనారాయణ చౌదరి గారిని ఆవిష్కరించడానికి ఒక పూర్తి రోజు సదస్సు నిర్వహించినప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. ఈసభ వలన చౌదరిగారి రచనలు తప్పక చదవాలనే ఉత్సుకత అందరిలోను కలిగిందన్నారు. గజారోహణం వంటి విశిష్ట సత్కారాన్ని అందుకున్న ధన్యులు చౌదరిగారని అభివర్ణించారు. సాహితీ సమారాధకులుగా, సాహితీ రంగంలో వారు మెట్టని చోటు, చేపట్టని ప్రక్రియ లేదని, కవిగా పండితునిగా నాటక కర్తగా కధకునిగా సరస విమర్శకునిగా సాహిత్యాభిలాషులందరికీ చిరపరిచితులని ఆచార్య బాల మోహన్ దాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల వారు చౌదరిగారిని గూర్చి వ్రాసిన పద్యాలను, ఆయన చదివి వినిపించారు. చౌదరిగారికి చాతుర్వర్ణ్య సిద్ధాంతము,అస్పృశ్యత వంటి అనాచారాలు గిట్టవని పేర్కొంటూ,ఈదుర్గుణాలు గతం లోకంటే ఇప్పుడే పెరిగాయేమో ననిపిస్తుందని, ఆవేదన వ్యక్తంచేశారు. కులాల వారీగా కాకుండా, రక్తం లోని గ్రూపుల వారీగా బంధుత్వాలు ఏర్పడితే బాగుంటుందేమో? అని అంటూ చౌదరిగారిప్పుడు ఉంటే ఈవిషయాన్ని మరింత అందంగా చెప్పిఉండే వారని బాల మోహన దాస్ పేర్కొన్నారు.ఆయన కృషిని, వ్యక్తిత్వాన్ని శతజయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ, కృతజ్ఞతాపూర్వకంగా గౌరవించుకుంటున్న చౌదరి గారి కుటుంబ సభ్యులను ఆచార్య బాల మోహన్ దాస్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈసందర్భంగా, పండిత సత్కార స్వీకర్త, సాహిత్య మాసపత్రిక "భావవీణ" సంపాదకులు శ్రీ కొల్లా శ్రీకృష్ణారావు ప్రసంగిస్తూ సత్యనారాయణ చౌదరి గారు ఎంతటి పండితులో అంతటి కవులని, కాని విమర్శకులుగా వచ్చిన పేరు కవిగా రాలేదని, అసలు వారి సాహితీ సేవకు తగిన గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారు ముక్కుకు సూటిగా పోయేవారని, వారికి అభిమాన సంఘాలు లేవని, భజన పరులు లేరని అన్నారు. చౌదరిగారిపై తాను వ్రాసిన పద్యాలను చదివి, సన్మానించిన నిర్వాహకులకు,చౌదరి గారి కుటుంబ సభ్యులకు,శ్రీకృష్ణారావు కృతజ్ఞతలు తెలియ చేశారు.
చౌదరి గారి మనుమరాలు చి.అనుపమ మాట్లాడుతూ, తమ తాత గారిని కలిసే అవకాశం, వారివద్ద కొత్త విషయాలను గ్రహించే అదృష్టం తనకు కలుగలేదని, అయితే ఈసభలో ఎందరో పెద్దల మాటల వలన తమ తాత గారి ప్రతిభావిశేషాలను కళ్ళారా చూసినట్లుందని పేర్కొంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తదుపరి శత జయంతి సభలో పాల్గొన్న అతిధులకు జ్ఞాపికలతో,దుశ్శాలువలతో సత్కరించడం జరిగింది.
ఈకార్యక్రమంలో కొత్త సత్యనారాయణ చౌదరి గారి కుటుంబ సభ్యులు, కుమారులు శ్రీయుతులు దివాకర దీక్షితులు, ప్రభాకరం, కమలాకరం, రత్నాకరం,శేషాద్రి శేఖరం,కుమార్తెలు పద్మావతి, లీలావతి, కోడళ్ళు లక్ష్మి పార్వతి,విజయ,నిర్మల,మంగాదేవి, డా. మాధవి,మనుమళ్ళు శ్రీనివాస మూర్తి, , సత్యమూర్తి, రాజేష్, సత్యవికాస్,బాలాజి, మనుమరాళ్ళు జయశ్రీ, రాజశ్రీ,అనుపమ పాల్గొన్నారు.

అదృష్ట దీపక్ సందేశం:
తెలుగు సాహిత్యం కొంతమంది దురహంకార పండితుల
చేతులలో కీలుబొమ్మగా తయారై, జీవిత వాస్తవాలను వక్రీకరిస్తున్న
సమయంలో ,
తప్పుల తడక సాహిత్యాన్ని, అవకతవక సాహితీ వేత్తలనూ
నిర్దాక్షిణ్యంగా చీల్చి చెండాడిన....
కొత్త సత్యనారాయణ చౌదరి గారు
విమర్శనా రంగంలో మిట్టమధ్యాహ్నపు సూర్యుడిలా ప్రజ్వలించారు.
సాహిత్య రంగంలొ సత్యశోధనకు జీవితాంతం కృషి చేసిన
సత్యనారాయణ చౌదరి గారి శతజయంతి ఉత్సవాలు
యువరచయితలకు కచ్చితమైన దిశానిర్దేశం చేస్తాయని
ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.
అభివందనాలతో......
అదృష్టదీపక్
రామచంద్రపురం











HTML Hit Counters


Web Counter